శ్రీ కూర్మనాథ క్షేత్రం శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన 'గార' నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రవాణా ...
శ్రీ కూర్మనాథ క్షేత్రం శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన 'గార' నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రవాణా సౌకర్యం బాగా ఉన్నది. శ్రీ కూర్మం లో తిరుమల- తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉన్నది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆరసవెల్లి ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది.
పురాణేతిహాసం
"పూర్వం దేవ దానవులు అమృతం కొరకు క్షీర సాగరాన్ని మధించడానికి యత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద ఆధారం లేనందున మందర పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్థించగా, విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడు" అని కూర్మ పురాణం చెపుతున్నది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్టించాడని చెపుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణం లోను, బ్రహ్మాండ పురాణాం లోను కనిపిస్తుంది. అత్యంత సుందరమైన శిల్పసంపద కలిగిన ఈ క్షేత్రాన్ని శ్రీరాముని కుమారులు లవ కుశులు కూడ దర్శించారని పురాణ కథనం. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉన్నది. తూర్పు, దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కను విందు చేస్తాయి. ఆస్థాన మండపంలోని నల్లరాతి స్థంభాల పై రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయ ఉపరిత భాగాన్ని గంధర్వులు నిర్మించారని, అందుకు దానిపేరు గంధర్వ విమానమని అంటారని ఒక కథనం. గాలి గోపురం ఎదురుగా సుధా కుండం ఉన్నది. దీనిని శ్వేత కుండం అని, శ్వేత పుష్కరిణి అని కూడా అంటారు.
ఆలయ విశిష్టత
ఏ ఆలయానికైనా ఒకే ధ్వజ స్థంభం ఉటుంది. కాని ఇక్కడ రెండు ధ్వజస్థంభాలుండడం విశేషం. అవి తూర్పు, పశ్చిమ దిశలలో ఉన్నాయి. ఆలయ మూల విరాట్ పశ్చిమాభిముఖంగా ఉన్నది. ఇక్కడ ఉత్తరాన భగవద్రామానుజులు, నైరృతిలో వేణుగోపాలస్వామి, వాయువ్యాన వైష్ణవి దుర్గ, లక్ష్మి సన్నిధి ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు వందకు పైగా తాబేళ్లతో ఏర్పాటు చేసిన పార్కు కూడ ఉన్నది. జేష్ట బహుళ ద్వాదశి నాడు ఈ స్వామి వారి జయంతి. జయంతి నాడు ఉదయం 5 గంటలకు స్వామికి క్షీరాభిషేకం చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
COMMENTS