పూరీ జగన్నాథ దేవాలయం పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయ...
పూరీ జగన్నాథ దేవాలయం
పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.
పుట్టుక
.ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది.
ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.
అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు. పని ప్రారంభించి పది రోజులైంది.
ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.
నిర్మాణం
ఈ ఆలయం 4,00000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైనా ప్రాకారం కలిగి ఉంది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయిక ఒరిస్సా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలో అతి పురాతమైన కట్టడాల్లో ఒకటి.
సింహ ద్వారం
ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది.
పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు
1. ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"వ్యతిరేకదిశ" లో ఉంటుంది.
2. ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.
3. మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
4. పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.
5. గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.
6. ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు.
7. జగన్నాథుని ఆలయంలోని వంటశాలలోచక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది. ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.
జగన్నాథ రథయాత్ర
ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి.దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
వంటశాల
ఆలయంలోని వంటశాల భారతదేశంలోనే పెద్దదిగా చెప్పబడుతోంది. పురాణాల ప్రకారం స్వయంగా మాహాలక్ష్మి వచ్చి ఇక్కడి వంటలను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ప్రసాదం తయారు చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే వంటశాల పరిసరాల్లో ఒక కుక్క కనిపిస్తుందని కూడా ఒక విశ్వాసం ఉంది. దీన్ని ఆలయ వంటవాళ్ళు (మహాసురులు అనికూడా అంటారు) అపశకునంగానూ, మహాలక్ష్మి సంతృప్తి చెందలేదని భావించి వండిన పదార్థాలన్నీ పూడ్చి వేసి మరల వంట చేస్తారు. ఈ వంటలన్నీ హిందూ ధర్మ శాస్త్రాలకనుగుణంగానే జరుగుతాయి. వంట చేయడానికి కేవలం మట్టి పాత్రలను మాత్రమే వాడతారు. అలాగే వంటకు అవసరమయ్యే నీటిని దగ్గర్లో గల గంగ, జమున అనే రెండు ప్రత్యేకమైన బావుల్లోంచి మాత్రమే సేకరిస్తారు. జగన్నాథునికి నైవేద్యం సమర్పించాక మిగతా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.
COMMENTS