హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హర...
హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని మరియు గోదావరి జన్మ స్థలమైన నాసిక్.
సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి.
కుంభమేళా
12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ. ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్ లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులూ, సాధు, సంత్లకు సంప్రదాయం ప్రకారం అంజుమన్ కామ్ గంధన్ పంచాయత్ కు చెందిన ముస్లిం పెద్దలు సాదర స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు ముస్లిం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములు ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదాలు అందజేస్తారు. కుంభమేళాలో పెష్వాయ్ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం, అలాగే, ముస్లింల ఉత్సవాలకూ, పండుగలకూ ఇక్కడి హిందూ నాయకులు శుభాకాంక్షలు తెలపడం, సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది. తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది.
పురాణ కాలం నుండి ప్రస్తుత కాలం వరకు హరిద్వార్
హరిద్వార్ ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ. హరిద్వార్ భారతీయ సంప్రదాయానికి, నాగరికతకు ప్రతిబింబం. పురాణాలలో ఇది కపిస్థాన్ గానూ, మాయాపురి మరియు గంగాపురిగా వర్ణించబడింది. ఉత్తరఖాండ్లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలవబడే గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్ మరియు బదరీనాథ్ లకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్ గానూ పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అని అర్ధం.
క్రీ.శ 629లో భారత దేశంలో పర్యటించిన చైనా హ్యూయన్ త్సాంగ్ రచనల్లో దీని వర్ణన ఉండటం వ్రాత పూర్వకంగా మొదటి సాక్ష్యంగా గుర్తించ బడినది. హ్యూయన్ త్సాంగ్ పర్యటించిన కాలం మహారాజు హర్షవర్ధనుడి(590-647) పరిపాలనా కాలంగానూ హ్యూయత్సాంగ్ చే ఇది మొ-యు-లొ గా సూచించబడింది. మొ-యు-లొ అంటే మాయాపురి సరిహద్దు అని హరిద్వార్ దక్షిణ భాగమని ఊహిస్తున్నారు. మొ-యు-లొ ఉత్తర భాగంలో గంగాద్వార్ (గంగా ముఖద్వారం) కోవెల ఉన్నట్లు అతనిచే సూచింపబడింది.
16వ శతాబ్దంలో అక్బర్ పరిపాలనలో అబుల్ ఫజల్ చే వ్రాయబడిన ఆయిన-ఎ-అక్బరీ గ్రంథంలో హరిద్వార్ మాయాపురిగా సూచింపబడింది. జహంగీర్ చక్రవర్తి (1596-1627)పరిపాలనా కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఆంగ్లేయ యాత్రికుడు థోమస్ కోర్యాట్ హరిద్వార్ని 'హరద్వారా' శివుని రాజధానిగా సూచించాడు.
కపిల ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించడం వలన ఇది కపిస్థాన్ గా కూడా పిలువబడినట్లు పురాణ కథనం. సత్య యుగంలో శ్రీ రామచంద్రుని పూర్వీకుడూ సూర్య వంశరాజు అయిన సరుని కుమారులలో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తన పితృదేవతలకు 60,000 మందికి ముక్తిని ప్రసాదించగోరి స్వర్గంనుండి గంగా దేవిని ఇక్కడకు రప్పించినట్లు హిందూ పురాణాల వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకు వచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హరి కి పురి లో వదిలి వెళుతున్నానని చెప్పినట్లు పురాణ కథనం. సదా ఈ పాదముద్రలు గంగానదిచే తడపబడటం విశేషం.
సిక్కు గురువు 'గురునానక్'(14469-1539)హరిద్వార్ లోని 'కుష్వన్ ఘాట్' లో స్నానం చేసిన సందర్భం వార మతగ్రంథాలైన 'జన్మసఖి'లో చోటుచేసుకుంది. హరిద్వార్ పురాతన సంస్కృతికి, సంప్రదాయాలతో సుసంపన్న మైన ఆధ్యాత్మిక నగరం. ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన హరిద్వార్లో ఇప్పటికీ చాలా హవేలీలు,మఠాలు పురాతన చిత్రాలు,శిల్ప సంపదతో విలసిల్లుతున్నాయి.
హరిద్వార్ పురాణ కాలంనుండి ప్రస్తుత కాలం వరకు తన పుతారన్త్వాన్ని,ఆధ్యాత్మిక వైభవాన్ని నిలుపుకుంటూ అభివృద్ధి పధంలో పయనిస్తున్న భారతీయ నగరాలలో ఒకటి. హరిద్వార్ బౌద్దుల కాలందాటి, ఆగ్లేయుల పరిపాలన చవిచూసి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తూ కొనసాగుతున్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటి.
భౌగోళికం
హరిద్వార్ గంగానది కొండలను దాటీ మైదానంలో ప్రవేశించే మొదటి ప్రదేశం. గంగా జలాలు ఎక్కువగా స్వచ్చంగా ఉంటాయి.వానాకాలం తప్పితే మిగతారోజులలో ఈ జలాలు శీతలంగానే ఉంటాయి. గంగా నది ఇక్కడి నుండి అనేక పాయలుగా విడిపోయి ప్రవహించడం వలన నదీ ద్వీపాల అనేక నదీద్వీపాలు ఏర్పడ్డాయి.ఈ నదీ ద్వీపాలు సమృద్దిగా నీరు లభించడం వలన ఏత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటాయి. వర్షాలాలంలో మాత్రం రాణీ పుర్ రావ్,పాత్రి రావ్,రావీ రావ్,హరిణై రావ్,బేగమ్ నది మొదలైన కొన్ని జలపాతాలనుండి నీరు ప్రవహించి చిన చిన్న సెలఏర్లు నదిలో కలుస్తూ ఉంటాయి. జిల్లాలో చాలా భాగం అటవీ ప్రాంతం.జిల్లా సరిహద్దులలో ఉన్న 'రాజాజీ నేషనల్ పార్క్' అటవీ జీవితం మరియు సాహస జీవితం గడపాలనుకొనే వారికి గమ్యస్థానం.
హరిద్వార్ నగరం వైశాల్యం 2360 కిమీ. ఉత్తరాఖండ్ నైరుతీ భాగంలో ఉంది. హరిద్వార్ సముద్రమట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో ఈశాన్యంలో శివాలిక్ కొండలు దక్షిణంలో గంగానదుల మధ్యభాగంలో ఉంది.
చూడవలసిన ప్రదేశాలు
హరి కీ పౌరీ
మహారాజు విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్ధంగా గంగా నది తీరంలో స్నానఘట్టం కట్టించాడని ప్రతీతి. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపసు చేసి ఇక్కడే తనువు చాలించిన కారణంగా అతని పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. తరువాతి కాలంలో 'హరి కా పురి'గా నామాంతరం చెందిది. ఈ పవిత్ర స్నాన ఘట్టం బ్రహ్మ కుండ్గా కూడా పిలుస్తారు.సాయంకాల సమయంలో గంగాదేవి హారతి ఇచ్చే ఆచారం ఉంది.తరువాత భక్తులు పితృదేవతా ప్రీత్యర్ధం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు ఈ దృశ్యం మనోహరంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.1800 తరువాత కాలలంలో ఇక్కడి స్నాన ఘట్టాలను పునరుద్ధరించి అభివృద్ది చేసారు.
చండీ దేవి
చండీ దేవి ఆలయం కాశ్మీర్ రాజు సుచత్ సింగ్ చే1929లో గంగానది అవతలి తీరంలో నీల పర్వత శిఖరం పైన నిర్మించబడింది. ఇది చండీ ఘాట్కు 3 కిలో మీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరంపైన ఉంది. రాక్షసరాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ ఈ ప్రదేశంలో చంఢీ దేవిచే సంహరించ బడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణంగా ఆ ప్రదేశం చంఢీ ఘాట్ పిలువబడుతుంది. ఈ దేవిని ఆదిశంకరాచార్యులు కీ.పూ 8 వ శతాబ్ధంలో ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఈ దేవాలయాన్ని ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటలవరకు కాలిబాటన లేక రోప్ వే ద్వారా చేరవచ్చు. ఆలయ నిర్వహణ ఫోన్ నంబర్ 01334-220324.
మంశా దేవి కోవెల
మంశాదేవి కోవెల బిల్వ ప్రర్వత శిఖరంపైన ఉంది. మంశాదేవి అంటే మనసులోని కోరికలను తీర్చేదేవి అని అర్ధం. ఇది భక్తుల ఆకర్షణీయ కోవెలలలో ఒకటి. ఈ కోవెలను చూడటానికి కేబులు కారులో ప్రయాణం చేయడం ద్వారా ఊరంటినీ చూడటం భక్తులకు ఆనందమైన అనుభవం.ఈ కోవెలలో రెండు ప్రధాన ఆలయంలో 5 చేతులు మూడు ముఖాలు కలిగిన విగ్రహం ఒకటి, 8 చేతులు కలిగిన విగ్రహం ఒకటి మొత్తం రెండు విగ్రహాలు ఉన్నాయి.ఆలయ నిర్వహణ ఫోన్ నంబరు 01334- 227745.
మాయాదేవి కోవెల
11వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా. ఇది ఆదిశక్తి ఆలయం. ఇది సిద్ధ పీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలోసతీదేవి హృదయం నాభి పడినట్లు పురాణ కథనం. హరిద్వార్ లో భైరవ ఆలయం నారాయణీ శిలా ఆలయం తో ఇది కూడా పురాతన ఆలయాలలో ఒకటి.
దక్షమహాదేవ్ కోవెల
హరిద్వార్కి దక్షిణంలో ఉన్న కంకాళ్ అనే ఊరిలో సతీదేవి తండ్రి అయిన దక్షుడి ఆలయం ఉంది. పురాణాల ఆధారంగా సతీ దేవి తండ్రి దక్షుడు తలపెట్టిన యాగానికి త్రిమూర్తులలో ఒకడు తన అల్లుడూ అయిన మహాశివునికి ఆహ్వానం పంపలేదు. సటీదేవి పుట్టింటి మీద మమకారాన్ని వదులుకోలేక తన తండ్రిని భర్త అయిన శివుని ఎందుకు పిలవలేదని అడగటానికి పిలవక పోయినా యగ్జానికి వెళుతుంది. అఖ్ఖడ తన భర్త అయిన శివుని ను పిలవకుండా యాగం చేయడం అపరాధమని తన తండ్రిని హెచ్చరిస్తుంది. దురహంకార పూరితుడైన దక్షుడు తన కుమార్తెను అవమానించి అల్లుడైన శివుని దూషిస్తాడు. అది భరించలేని సతీదేవి అదే యజ్ఞకుండంలో దూకి ప్రాణ త్యాగంచేస్తుంది. సతీదేవి ప్రాణత్యాగం తెలుసుకున్న శివుడు తన ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షుణ్ణి సంహరించమని పంపిస్తాడు. వీరభద్రుని చేతిలో మరణించిన దక్షుణ్ణి దేవతలు, దక్షిణి భార్య కోరిక పై తిరిగి దక్షుని శరీరానికి మేక తలను అతికించి బ్రతికిస్తాడు. ఈ పురాణ సన్నివేశానికి గుర్తుగా ఇక్కడ దక్ష మహాదేవ్ కోవెల నిర్మించారు.
నీల్ ధారా పక్షుల శరణాలయం
ఈ పక్షులశరణాలయం భీమగోడా ఆనకట్ట దగ్గర ఉంది. నీల్ ధారా సమీపంలో గంగానది పై నిర్మించిన ఆనకట్ట పేరే భీమ్గోడా రిజర్వాయర్. ఇది ప్రకృతి ఆరాధకులకు ముఖ్యంగా పక్షులంటే ఆసక్తి కనబరిచేవారికి ఇది స్వర్గ సీమ. శీతాకాలంలో ఇక్కాడకు వలస వచ్చే విడేశీ పక్షులకు ఇది నివాసం.
సతీకుండ్
కంఖాళ్ లో'సతీకుండ్'పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రడేశాలలో ఇది ఒకటి.ఇది సతీ దేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండం.
భీమ్గోడా సరస్సు
హరి కి పురి నుండి ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.ఇది పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి.పాండవులు హిమాలయాలలో ప్రయాణిస్తూ హరిద్వార్కి వచ్చినప్పుడు రాజకుమారుడు భీమసేనుడు దాహం తీర్చుకోవడానికి మోకాలితో కొట్టడం ద్వారా రాతినుండి రప్పించినప్పుడు ఈ సరసు ఏర్పడిందని పురాణ కధనం.
జైరామ్ ఆశ్రమ్
పాలరాతిలో చెక్కిన పాలసముద్ర మధనం దృశ్యాల ప్రదర్శన ఇక్కడికి విచ్చేసే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.
సప్తఋషి ఆశ్రమ్ మరియు సప్తఋషి కుండ్
హరిద్వార్లోని అత్యంత మనోహర దృశ్య కావ్యం ఇది. సప్తఋషులైన అత్రి, వశిష్ఠుడు,కశ్యపుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరధ్వాజుడు మరియు గౌతములకు అనుకూలంగా ఇక్కడ గంగా నది ఏడు భాగాలుగా చీలి ప్రవహిస్తుంది.
పరాడ్ శివలింగం
కంఖాళ్ లో హరిహర ఆశ్రమంలో ఉన్న ఈ బ్రహ్మాండ శివలింగం 150 కిలోల బరువు ఉంటుంది.రుద్రాక్ష చెట్టు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
దూధాధారి బర్ఫానీ కోవెల
ఇది దూధాధారి బర్ఫానీ ఆశ్రమంలో ఒకభాగమైన పాలరాతి కోవెల. ప్రత్యేకంగా రాముడు, సీతా మరియు హనుమంతుని గుడులు యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ.
సురేశ్వరీ ఆలయం
ఇది రాజాజీ నేషనల్ పార్క్లో ఉన్న ఈ సురేశ్వరీ దేవత గుడి. ఇక్కడి ప్రశాంత వాతావరణం యాత్రీకుల మనసు దోచుకుంటూ విస్తారంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది.ఇది హరిద్వార్కి సరిహద్దులలో ఉంది ఇక్కడికి పోవాలంటే అటవీశాఖ అనుమతి పొందవలసి ఉంటుంది.
పవన్ ధాం
ఆధునిక కాలంలో నిర్మించిన అద్దాల మండపం. ఇప్పుడు ఇది యాత్రీకుల ప్రత్యేక ఆకర్షణ.
భారత మాత మందిర్
ఇది అనేక అంతస్థులతో నిర్మించిన గుడి. భారత మాతకు భక్తి భావంతో సమర్పించిన గుడి ఇందులో ఒక్కొక్క అంతస్థులో ఒక్కొక్క శకానికి చెందిన భారత దేశ చరిత్ర చిత్రించారు. రామాయణం మొదలైన పురాణ కాలం నూడి ప్రస్తుత కాలం వరకు చరిత్ర చోటు చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
ఆనందమయి మాత ఆశ్రమ్
ఆనందమయి మా ఆశ్రమ్ హరిద్వార్ ఐదు ఉపనగరాలలో ఒకటైన కంఖాళ్లో ఉంది. శ్రీ ఆనందమయి(1896-1982) మా యొక్క సమాధి ఉన్న గుడి ఇది. ఈమె భారత దేశంలో ప్రముఖ సన్యాసిని.
పిరన్ కాలియార్
సుఫీ సన్యాసి చిష్టి ఆర్డర్(ఈయనకు సరకార్ కబీద్ పాక్ అనే ఇంకొక పేరు ఉంది) కొరకు 13వ శతాబ్ధంలో ఇబ్రహీమ్ లోడీ నిర్మించిన దర్గా.రూర్కేకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలియార్ గ్రామంలో దర్గా ఆఫ్ హజారత్ అలాదీన్ కాలియార్ పేరుతో నిర్మించిన ఈ దర్గా కు రంజాను మాసంలో నెలబాలుడిని దర్శించడానికి భారత దేశంలోని అనేక భక్తులను ఆకర్షిస్తుంది.
ఉత్సవాలు
మతపరంగా ముఖ్యత్వం ఉన్న నగరం కనుక ఇక్కడ సంవత్సరం అంతా ఉత్సవాలు జరుగుతుంటాయి. వీటిలో ముఖ్యమైనవి సోమవతి అమావాస్య మేళా, గుఘల్మేళా దీనిలో 20-25 లక్షల భక్తులు పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒక సారి జరిగే కుంభమేళా. గురు గ్రహం కుంభరాశిలో ప్రవేసించే సమయంలో 12 రోజుల పాటు జరిగే ఉత్సవం ఇది. 629 క్రీ.శ. చైనా పర్యాటకుడు హ్యూయన్ త్సాంగ్ (602-664) వ్రాసిన గ్రంధంలో ఈ ఉత్సవాన్ని గురించిన వర్ణన మొదటి వ్రాతపూర్వక ఋజువు. 1988 లో జరిగిన కుంభ మేళా లో 1 కోటి మంది భక్తులు, కుంభమేళా సమయంలో గంగా స్నానమాచరించటానికి ఇక్కడకు వచ్చి చేరినట్లు అంచనా.
ప్రయాణ వసతులు
ఢిల్లీ మనాపాస్ ను కలుపుతూ నిర్మించిన 58వ జాతీయ రహదారిలో ప్రయాణించి హరిద్వార్ను చేరవచ్చు. హరిద్వార్లోని రైల్వే స్టేషన్ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చేరటం సులువే. సమీపంలో ఉన్న విమానాశ్రయం డెహరాడూన్లోని 'జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ '. అయినప్పటికీ ఢిల్లీ లోని ఇందిరాగాంధీ విమానాశ్రయం ద్వారా వెళ్ళడమే సౌకర్యంగా ఉంటుంది.
COMMENTS